రెండు వారాలుగా నిలిచిపోయిన చింతపండు క్రయవిక్రయాలు


అనంతగిరి, ఏప్రిల్ 8 (సమైక్యాంధ్ర) : ఏజెన్సీలోని గిరిజనులకు ప్రస్తుత సీజన్ లో చింతపండు ప్రధాన ఆదాయ వనరు. ప్రతి వారపు సంతలో చింతపండు క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. కానీ కరోనా వైరస్ ప్రభావం చింతపండు రైతులపై తీవ్రంగా పడింది. వారపు సంతలను నిర్వహించ వద్దని అధికారులు ఆదేశాలు జారీచేయడం, లాక్ డౌన్ కారణంగా అత్యవసర సరకుల రవాణాకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో గిరిజనులు చింతపండు అమ్ముకోలేకపోతున్నారు. కొద్దిరోజుల నుంచి వడగళ్లతో అకాల వర్షాలు పడుతుండడం, ఇళ్లల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు అంతగా లేకపోవడంతో చింతపండు పాడై పోతున్నదని వాపోతున్నారు. గ్రామాలకు సమీపంలోని అడవుల్లో చింతపండు సేకరించి, దగ్గరలో వున్న సంతల్లో లేదా గ్రామాలకు వచ్చే వ్యాపారులకు అమ్ముకుంటూ గిరిజనులు ఆదాయాన్ని పొందుతుంటారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షాలు సమృద్ధిగా పడడంతో ఈ ఏడాది చింత చెట్లు బాగా కాశాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. దీనికితోడు సంతల్లో ధర కూడా సంతృప్తికరంగా ఉంది. లాక్ డౌన్ ముందు వరకు సంతల్లో కిలో (పిక్కతో) రూ. 50 నుంచి రూ. 60కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలడంతో దాని వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మార్చి నాలుగో వారం ఆరంభం నుంచి లా డౌన్ విధించింది. మన్యంలో ఏ ఒక్క సంతనూ నిర్వహించవద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. మైదాన ప్రాంతం నుంచి నిత్యావసర సరకులు మినహా మరే ఇతర వాహనాలు మన్యానికి రావడానికి వీలు లేదంటూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో మైదాన ప్రాంతం నుంచి పెద్ద వ్యాపారులు ఏజెన్సీకి రావడం లేదు. గిరిజనులు సంతలో అమ్ముకుని వీలులేకుండా పోయింది. స్వయంగా మైదాన ప్రాంతంలోని మార్కెట్లకు తీసుకువెళ్లి అమ్ముకునేటంత అవగాహన కూడా లేదు. మరోవైపు జీసీసీ కూడా చింతపండు కొనుగోళ్లు ప్రారంభించలేదు. గిరిజన గ్రామాల్లో వుండే చిన్నవ్యాపారులు...స్థానికంగా గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు చేసి, పెద్ద వ్యాపారులకు అమ్ముతుంటారు. వీరి వద్ద ఇప్పటికే చింతపండు నిల్వలు పేరుకుపోవడం, మైదాన ప్రాంతం నుంచి పెద్ద వ్యాపారులు రాకపోవడంతో వీరు కూడా స్థానికంగా కొనుగోళ్లు ఆపేశారు. దీంతో గిరిజనులు చింతపండు ఎలా అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.